రాబోయేదంతా డిజిటల్ వ్యవసాయమే.. యువత అవకాశాలను అందుకోవాలి: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోడీ

Siva Kodati |  
Published : Feb 05, 2022, 04:03 PM ISTUpdated : Feb 05, 2022, 05:08 PM IST
రాబోయేదంతా డిజిటల్ వ్యవసాయమే.. యువత అవకాశాలను అందుకోవాలి: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోడీ

సారాంశం

వచ్చే 25 ఏళ్లలో  వ్యవసాయం మార్పులపై దృష్టి సారించామని.. డిజిటల్ వ్యవసాయం దేశ ముఖచిత్రాన్ని మార్చుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.   

ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో  పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ... ఆజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నారు. ఇక్రిశాట్ సేవలను తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానని మోడీ పేర్కొన్నారు. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తోందని ప్రధాని ప్రశంసించారు. వసంత పంచమి రోజున స్వర్ణోత్సవవాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. 

వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమని మోడీ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తామని.. కానీ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం గురించి మాట్లాడమని ఆయన గుర్తుచేశారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుందని.. ఈసారి బడ్జెట్‌లో కూడా వాతావరణ మార్పుల అంశానికి ప్రాధాన్యం ఇచ్చామని మోడీ గుర్తుచేశారు. 

దేశంలో వ్యవసాయానికి సంబంధించి విభిన్నమైన సంప్రదాయాలు వున్నాయని... సహజ సేద్యం, డిజిటల్ వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. వచ్చే 25 ఏళ్లలో  వ్యవసాయం మార్పులపై దృష్టి సారించామని.. డిజిటల్ వ్యవసాయం దేశ ముఖచిత్రాన్ని మార్చుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. యువకులు ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలని మోడీ కోరారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాల్లో కృత్రిమ మేథను వినియోగించబోతున్నామని.. సమ్మిళిత వృద్ధికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రైతులకు ఈ మిషన్ చాలా ఉపయోగకరమని.. మెట్ట ప్రాంతాల పరిశోధనలో ఇక్రిశాట్‌కు చాలా గొప్ప పేరుందని మోడీ ప్రశంసించారు. ఇది సేంద్రీయ ఇంధనాల శకమని.. రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇక్రిశాట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్రిశాట్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కొత్త వంగడాలను ఎలా ఉత్పత్తి చేస్తారో శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శెనగ, వేరుశెనగ ఇతర చిరుధాన్యాలు, విత్తన  రకాలు, నాణ్యతపై ప్రధాని తెలుసుకున్నారు. అలాగే వర్షపు నీటి నిర్వహణపై వీడియోను మోడీ తిలకించారు. అనంతరం ప్రధాని మోడీకి ఇక్రిశాట్ డైరెక్టర్ జాక్వెలిన్ హ్యూస్ జ్ఞాపికను అందజేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నరేంద్ర సింగ్ తోమర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై వున్నారు. 

అనంతరం వేదికపై తోమర్ (narendra singh tomar) మాట్లాడుతూ.. ఈ దేశానికి రైతులు, వ్యవసాయం చాలా ప్రధానమైనవని అన్నారు. ఒకప్పుడు జై జవాన్.. జై కిసాన్ అనే వారని, అయితే వాజ్‌పేజ్ ప్రధాని అయ్యాక జై విజ్ఞాన్‌ను జోడించారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి గుర్తుచేశారు. మోడీ ప్రధాని అయ్యాక జై అనుసంధాన్ కూడా దానికి జోడించారని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రధాని చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. కోవిడ్ సమయంలో తృణధాన్యాల వినియోగం పెరిగిందని తోమర్ చెప్పారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పూర్తి చేసుకోవడం స్పూర్తిదాయకమన్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రతిఏడు బడ్జెట్‌లో దేశానికి కొత్త దిశ సూచిస్తున్నారని తోమర్  తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు మార్గదర్శనం చేసేలా ఈసారి బడ్జెట్ రూపొందించారని ఆయన పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu