సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చర్చలు.. తాజా పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం..!

By Sumanth KanukulaFirst Published Dec 17, 2022, 5:22 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  భేటీ అయ్యారు. శనివారం ప్రగతిభవన్‌కు వచ్చిన రోహిత్ రెడ్డి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  భేటీ అయ్యారు. శనివారం ప్రగతిభవన్‌కు వచ్చిన రోహిత్ రెడ్డి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారునిగా ఉన్న సంగతి  తెలిసిందే. అయితే ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో లీగల్ ఓపినియన్ తీసుకన్న రోహిత్ రెడ్డి.. తాజాగా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ పాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశం సందర్భంగా ఈడీ నోటీసులు, తనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల గురించి కేసీఆర్‌ వద్ద రోహిత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం రోహిత్ రెడ్డి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రోహిత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో ఆ కేసుపై ప్రమాణం చేద్దామని బండి సంజయ్‌కు సవాలు విసిరారు. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు.. బండి సంజయ్‌కు సవాలు.. 24 గంటలు డెడ్‌లైన్..

తాను రేపు ఇదే సమయానికి ఇక్కడికే వస్తున్నామని.. బండి సంజయ్‌ కూడా ఇక్కడకు వచ్చి తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపెట్టాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ రుజువు చేయాలని సవాలు విసిరారు. లేకపోతే బండి సంజయ్ దొంగ హిందువని తెలంగాణ ప్రజలు నమ్ముతారని అన్నారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. 

బండి సంజయ్ తంబాకు తినడం మానేయాలని.. నోరు తిరగడం లేదని, ఆయన ఏం చెబుతున్నారో కూడా అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చెప్పినట్టుగానే తనకు నోటీసులు వచ్చాయని.. ఈ విషయం ఆయనకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు వస్తాయని ఢిల్లీలోని బీజేపీ నాయకులు ముందే చెబుతురాని అన్నారు. 

బీజేపీ  నాయకులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. హిందూత్వం పేరుతో దేశంలోని యువతను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసలైన హిందూత్వవాది తెలంగాణ సీఎం కేసీఆర్ అని.. చరిత్రలో ఎవరూ ఆలోచించని విధంగా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పుననిర్మించారని చెప్పారు.బీజేపీ నేతలు పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చెంపపెట్టులాగా తీర్పు ఇచ్చిన బీజేపీకి బుద్ది రాలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని విమర్శించారు. అందుకే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.  

click me!