బిఆర్ఎస్ ఎమ్మెల్యే బారినుండి కాపాడండి మహాప్రభో..!: ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

By Arun Kumar PFirst Published Jan 2, 2024, 4:46 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై భూకబ్జా ఆరోపణలు చేసారు కొందరు ప్రజలు. 

హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఆయన నియోజకవర్గ ప్రజలే భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట్ పరిధిలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని ప్రకాష్ నగర్ వాసులు చెబుతున్నారు. అయితే ఈ భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే దానం తన అనుచరులతో బెదిరిస్తున్నారని బస్తీవాసులు తెలిపారు. తమ భూమిని దానం ఆక్రమించుకోకుండా అడ్డుకుని న్యాయం చేయాలంటూ ప్రకాష్ నగర్ బస్తీవాసులు ఇవాళ చేపట్టిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. 

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా ఇవాళ(మంగళవారం) బేగంపేటలోని ప్రజా భవన్ లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా చేరుకున్నారు ప్రకాష్ నగర్ వాసులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడని... తమ ఇళ్ళను కూల్చేసి మరీ ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుండి తమను కాపాడాలని...కష్టపడి కట్టుకున్న ఇళ్లజోలికి ఎవరూ రాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రకాష్ నగర్ వాసులు కోరారు. 

Latest Videos

Also Read  అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేళ ... ముస్లిం యువతకు అసదుద్దీన్ సంచలన పిలుపు

ఇదిలావుంటే మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపైనా భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాసంస్థలు, హాస్పిటల్స్ తో పాటు ఇతర వ్యాపారాలు కలిగిన మల్లారెడ్డి పెద్ద భూకబ్జాదారుగా గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి భూకబ్జాలపై ఫిర్యాదు అందినవెంటనే కేసులు నమోదు చేయిస్తోంది కాంగ్రెస్ సర్కార్.  

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని ఎస్టీ సామాజికవర్గానికి చెందిన కుటుంబాల భూములను మల్లారెడ్డి ఆక్రమించారట.  సర్వే నంబర్లు 33,34,35 లోని 47 ఎకరాలకు పైగా భూమిని మల్లారెడ్డితో పాటు మరో తొమ్మిదిమంది అనుచరులు కబ్జా చేసారట. బాధితులు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.  

click me!