తెలంగాణ విషయంలో మొదటినుంచీ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభిమానం చూపుతూ ఉండేవారు. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే వివాదాల్లో చిక్కుకున్న సందర్భంలో పవన్ కూడా గట్టిగానే ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పవన్ కళ్యాన్ మీద టిఆర్ఎస్ నేతలు పరుష కామెంట్లు చేశారు. దానికి పవన్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.
రాష్ట్రం విభజన అయింది. పవన్ కళ్యాణ్ కొంతకాలంపాటు రాజకీయాలు పక్కనపెట్టి వరుస సినిమాలు తీసుకున్నారు. తాజాగా మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు పవన్. విజయవాడలో వరుస సమావేశాలు, సభలు పెట్టి అక్కడివారితో ముచ్చటిస్తున్నారు. విజయవాడలో జరిగిన సభలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు.
విజయవాడలో విద్యార్థులతో పవన్ సుదీర్ఘంగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సమయంలో అనేక అంశాలపై పవన్ మనసు విప్పి మాట్లాడారు. అయితే మాటల సందర్భంలో తెలంగాణ విషయం కూడా చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలకు కుల పిచ్చి లేదని పవన్ కామెంట్ చేశారు. కానీ ఆంధ్రలో కులపిచ్చి తీవ్రంగా ఉందన్నారు.
తనకు అన్ని కులాలు ఒకటే అని పవన్ పేర్కొన్నారు. ఆంధ్రాలో కులాల మధ్య ఐక్యత తీసుకురావాలన్న ఉద్దేశంతో తాను ఉన్నానని అన్నారు. ఆ ప్రయత్నం సఫలమైతే అమరావతి బెస్ట్ రాజధానిగా నిలబడుతుందన్నారు. హైదరాబాద్ లో కానీ, తెలంగాణలో కానీ కుల పిచ్చి లేదన్నారు. కులాల మధ్య ఐక్యత కోసం అదరూ ముందుకు రావాలన్నారు పవన్ కళ్యాణ్.