పట్నం దంపతులు రేవంత్ తో భేటీ: రంగారెడ్డి రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా?

By narsimha lodeFirst Published Feb 9, 2024, 9:58 AM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.  బీఆర్ఎస్ లో బలమైన నేతలను తమ వైపునకు ఆకర్షిస్తుంది.

హైదరాబాద్: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి,  ఆయన సతీమణి  పట్నం సునీతా రెడ్డిలు  కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రభావం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు  ముందే  మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే  పట్నం మహేందర్ రెడ్డిని  కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  తాండూరు అసెంబ్లీ స్థానం నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే  బీఆర్ఎస్ నాయకత్వం టికెట్టు కేటాయించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి రోహిత్ రెడ్డి  ఓటమి పాలయ్యాడు. తన ఓటమికి  పట్నం మహేందర్ రెడ్డి వర్గమే కారణమని రోహిత్ రెడ్డి  వర్గం ఆరోపణలు చేసింది.

ఈ తరుణంలో  మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డిలు  ఈ నెల  8వ తేదీన  తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా  పట్నం సునీతా రెడ్డి ప్రకటించారు.

also read:కేసీఆర్ కాలం చెల్లిన ఔషదం: రేవంత్ రెడ్డి సెటైర్లు

2018, 2023 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం  నరేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి  తరపున పోటీ చేశారు.  2018లో కొడంగల్ నుండి  పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డి చేతిలో పట్నం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు.

2014 ఎన్నికల ముందు వరకు   పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం తెలుగు దేశం పార్టీలో ఉంది. ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  పట్నం మహేందర్ రెడ్డి  సోదరులు  తెలుగు దేశం పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.  2014లో  తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి  అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మంత్రివర్గంలో  పట్నం మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.  2018 ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించారు.  రోహిత్ రెడ్డి  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.

also read:బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది.  రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి చాలా ఏళ్లుగా ఆ కుటుంబ సభ్యులే ఉన్నారు.  చేవేళ్ల పార్లమెంట్  స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ తరపున  పట్నం మహేందర్ రెడ్డి  కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని ఆ పార్టీ  భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే  పట్నం మహేందర్ రెడ్డి దంపతులు నిన్న  రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని సమాచారం.

పట్నం మహేందర్ రెడ్డి దంపతులు  కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


 

click me!