ప్రణయ్ విగ్రహం.. వెల్లువెత్తిన నిరసనలు

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 9:56 AM IST
Highlights

రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదన్నారు.

మిర్యాలగూడలో ఇటీవల ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు గురైన సంగతి తెలిసిందే. తమ కుమార్తె వేరే కులస్థుడిని ప్రేమించిందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. అయితే..మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కొందరు తీసుకువచ్చారు.

కాగా.. ప్రణయ్ విగ్రహ ఏర్పాటు సరికాదంటూ మిర్యాలగూడలో కొందరు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మిర్యాలగూడలోని తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు స్థానిక మినీ రవీంద్రభారతి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజాపా రాష్ట్ర నాయకుడు కర్నాటి ప్రభాకర్‌, న్యాయవాది చిలుకూరి శ్యామ్‌ మాట్లాడుతూ.. ప్రణయ్‌ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నటు చెప్పారు. ఇది రెండు కుటుంబాల మధ్యలో జరిగిన సమస్య అని, దీన్ని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సరికాదన్నారు.

 ప్రణయ్‌ విగ్రహాన్ని ఆయనకు చెందిన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణంలో అందరు తిరిగే కూడలిలో ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు చెడు సందేశం వెళ్లడంతోపాటు ప్రజల మధ్య మరింత అంతరాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. అక్కడినుంచి నేరుగా వీరంతా ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ, పురపాలిక అధికారులు ఫిర్యాదు చేసినందున దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం వారు ర్యాలీగా పురపాలిక కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
 

click me!