బ
హైదరాబాద్: అతడు చేసేది పానీపూరీ వ్యాపారం.. అందులో ఏం లాభం రావడం లేదని అనుకున్నాడెమో అక్రమ సంపాదన కోసం చెడు దారి పట్టాడు. గంజాయి విక్రయించడం మొదలుపెట్టాడు. తాజాగా హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ బృందం అతడిని అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. వివరాలు.. అబిడ్స్కు చెందిన ముస్తాపూర్ ప్రశాంత్ తాజ్ మహల్ హోటల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒకటి, భారతి విద్యాభవన్ రోడ్ వద్ద మరోక పానీ పూరీ స్టాల్ నడుపుతున్నాడు. రోజురోజుకు పెరిగిపోతున్న దుబారా ఖర్చులకు తన వ్యాపారం సరిపోకపోవడంతో హైదరాబాద్లో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉండడంతో దానిని అమ్మేందుకు ప్లాన్ వేశాడు.
ఓ వైపు పానీ పూరీ స్టాల్స్ నిర్వహిస్తూనే.. గంజాయి కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అబిద్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ గేటు ముందు వినియోగదారులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలోనే అతడిని పోలీసులు పట్టుకున్నారు.
‘‘ధూల్పేటలోని జాలి హనుమాన్లో నివసించే యశ్వంత్ అలియాస్ గౌతమ్ అనే వ్యక్తి నుండి కిలో గంజాయిని రూ. 25,000 కొనుగోలు చేసి.. రూ.45,000 విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రశాంత్ తెలిపాడు. పథకం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేట్ దగ్గరకు వచ్చి వినియోగదారులకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడు పట్టుబడ్డాడు’’ అని పోలీసులు తెలిపారు.