
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు (Rythu Bandhu) సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం కూలిపోయే వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వం కేంద్రంలో అధికారం వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక కూటముల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ అనేది లేదని అన్నారు. సీఎం స్టాలిన్ పిలిస్తే కేసీఆర్ వెళ్లి కలుస్తారని అన్నారు. బీజేపీ పై పోరాటం విషయంలో పోరాడే శక్తులతో సమయానుసారం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రూ. 50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ది దేశం మొత్తం కనిపిస్తుంటే.. ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని తెలిపారు.
బీజేపీ నేతలు గవర్నర్ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. కానీ రైతులు అంతా బాగానే ఉందని సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర మంత్రులు ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వచ్చే యాసంగిలో వరి వేయకుండా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 51 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరును టీఆర్ఎస్ సర్కార్ అందించిందన్నారు. 26 లక్షల వ్యవసాయ మోటర్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గిందన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన 66 వేల123కి రైతు బీమా రూపంలో సాయాన్ని అందించామన్నారు. ఎల్ఐసీని కేంద్రం ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు.