హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం... వృద్దురాలిని చిదిమేసిన కారు

By Arun Kumar PFirst Published Aug 29, 2022, 12:52 PM IST
Highlights

హైదరాబాద్ శివారులోని దూలపల్లిలో ఓ యువకుడి నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్ ఓ నిరుపేద వృద్దురాలిని బలితీసుకుంది. కారు ఢీకొట్టడంతో రోడ్డుపక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే వృద్దురాలు మృతిచెందింది. 

హైదరాబాద్ : పొట్టకూటికోసం రోడ్డుపక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే ఓ వృద్దురాలిని యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ బలితీసుకుంది. రోడ్డుపై వేగంగా వెళుతూ అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన కూర్చున్న మహిళపైకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లిలో చిట్టెమ్మ (60) రోడ్డుపక్కన మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటుంది. రోజూ మాదిరిగానే  ఇవాళ (సోమవారం) కూడా దూలపల్లి క్రాస్ రోడ్డులోని ఎన్డీఆర్ విగ్రహం వద్ద మొక్కజొన్న పొత్తులు పెట్టుకుని కూర్చుంది. అయితే అందరూ చూస్తుండగానే ఓ కారు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. 

కొత్త బ్రిజా కారు దూలపల్లి నుండి మైసమ్మగూడ వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. దూలపల్లి క్రాస్ రోడ్డుకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న చిట్టెమ్మపైకి వేగంగా దూసుకెళ్లింది. కారు ఢీకొట్టడంతో వృద్దురాలు రక్తపుమడుగులో అక్కడిక్కడే మృతిచెందింది. 

Read more ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్ర ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి, మరోకరి పరిస్థితి విషమం

ప్రమాదంపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు డ్రైవర్ అజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వృద్దురాలి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి, చిట్టెమ్మ మృతికి కారణంగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఈ ప్రమాదంలో కారు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 

click me!