
పాలకుర్తి : తెలంగాణలోని జనగామ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. డాక్టర్ కి బదులు నర్స్ సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. గురువారం నాడు బాధితులు ఆందోళన చేపట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.
మండలంలోని దద్దేపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన స్రవంతికి బుధవారం నాడు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్రవంతిని వెంటనే పాలకుర్తి లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు సాధారణ కాన్పు చేస్తామని సిబ్బంది చెప్పడంతో అక్కడే ఉండిపోయారు. అయితే స్రవంతికి అర్ధరాత్రి నొప్పులు అధికమయ్యాయి.
27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన: రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
ఆ సమయంలో స్వప్న అనే వైద్యురాలు విధుల్లో ఉండాలి. కానీ ఆమె అందుబాటులో లేరు. దీంతో సరిత అనే స్టాఫ్ నర్స్ సిబ్బంది సహాయంతో సిజేరియన్ చేసింది. ఆడ శిశువుకు స్రవంతి జన్మనిచ్చింది. అయితే బిడ్డలో చలనం లేదు. దీంతో వెంటనే తల్లి బిడ్డ ఇద్దరినఅ జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లుగా జనగామ ఏరియా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
దీంతో గురువారం నాడు శిశువు కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందంటూ ఆరోపించారు. ప్రజాసంఘాలతో కలిసి పాలకుర్తిలోని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. స్టాఫ్ నర్స్ ను, వైద్యురాలిని విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. పాలకుర్తి ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొనడంతో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకుడు సుగుణాకర్ రాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
శిశువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదును వైద్యాధికారులు స్వీకరించారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్ స్వప్న, వైద్యురాలు లేకుండా కాన్పు చేసిన స్టాఫ్ నర్స్ సరితపై చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. వైద్యురాలు స్వప్న సెలవు పెట్టకుండానే విధులకు గైర్హాజరైనట్లుగా సమాచారం.