
తెలంగాణ కేబినెట్లో స్థానం పొందిన ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి శాఖను కేటాయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు ఐ అండ్ పీఆర్, గనులు, భూగర్భ శాఖను అప్పగించారు. కాగా.. గురువారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ .. పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న పట్నం .. తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పిస్తామని అధిష్టానం తేల్చిచెప్పింది. అయినప్పటికీ మహేందర్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేశారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వుంది.
ALso Read: కేసీఆర్ కేబినెట్లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్
అయితే బీఆర్ఎస్ పెద్దలు జోక్యం చేసుకోవడంతో పరిస్ధితులు చక్కబడ్డాయి. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డికే తాండూరు టికెట్ కేటాయించారు కేసీఆర్. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పెద్దలు సైతం వీటిని ధ్రువీకరించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గా మహేందర్ రెడ్డి భార్య పనిచేశారు. ప్రస్తుతం ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.