టీఆర్ఎస్‌లో అవిశ్వాసాల చిచ్చు.. మొన్న భువనగిరి.. నేడు రామగుండం

First Published Jul 6, 2018, 5:22 PM IST
Highlights

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య తలెత్తిన వివాదాలు ముదిరిపాకాన పడుతున్నాయి.. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి.. పార్టీ పరువును బజారుకీడిస్తున్నాయి. మరి ముఖ్యంగా పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల్లో ఈ కోల్డ్‌వార్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య తలెత్తిన వివాదాలు ముదిరిపాకాన పడుతున్నాయి.. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి.. పార్టీ పరువును బజారుకీడిస్తున్నాయి. మరి ముఖ్యంగా పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల్లో ఈ కోల్డ్‌వార్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు.

ఛైర్మన్ తీరు ఏ మాత్రం బాలేదంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఈ గొడవ సద్దుమణగకముందే.. కరీంనగర్ జిల్లా రామగుండంలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విభేదాలు మరింత రచ్చకెక్కాయి..

ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మధ్య జరుగుతున్న గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇవి మేయర్‌పై అవిశ్వాసం పెట్టేవరకు వెళ్లింది..మేయర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ 39 మంది కార్పోరేటర్లు జిల్లా కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. ఇదే బాటలో జిల్లాలోని 10 మండలాల ఎంపీపీలపైనా అవిశ్వాసం పెట్టే అవకాశం కనిపిస్తుంది. వేములవాడ, మెట్‌పల్లి, గంగాధర ఎంపీపీలకు ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. పార్టీ పరువు బజారున పడుతుండటతో టీఆర్ఎస్ పెద్దలు రంగప్రవేశం చేసి నేతలను బుజ్జగించే అవకాశం ఉంది.
 

click me!