బాలికను కిడ్నాప్ చేస్తున్నాడనుకుని.. బైకిస్ట్‌కు దేహశుద్ధి: సీసీటీవీలో అసలు వాస్తవం

By Siva KodatiFirst Published Apr 8, 2021, 4:39 PM IST
Highlights

బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జుక్కల్ ప్రాంతానికి చెందిన అశోక్, రేఖ దంపతులు ఇదే మండలంలోని పచ్చల నడ్కుడ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వీరి నాలుగేళ్ల కుమార్తె శ్రావణి.. నిన్న సాయంత్రం ఇంటి దగ్గరి నుంచి దుకాణానికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో నిజామాబాద్‌కు చెందిన షేక్ రెహమాన్ భీమ్‌గల్‌కు తన బైక్‌పై వెళ్తున్నాడు.

ఈ నేపథ్యంలో అతని బైక్ శ్రావణి డ్రెస్స్‌కు తగిలి కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు... బాలికను కిడ్నాప్ చేసి సంచిలో వేసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని అనుమానించారు.

అంతే వందల మంది అక్కడకు వచ్చి రెహమాన్‌ను బంధించి గ్రామపంచాయతీ వద్దకు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాలికతో పాటు ఆమె వెంట ఉన్న బాలుడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. బాలిక కిడ్నాప్‌ కాలేదని, డ్రెస్‌ బండికి తగిలి పడిపోయిందని తేలింది. దీంతో పోలీసులు రెహమాన్‌కు చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. 
 

click me!