తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అతిభారీ వర్షాలు... ఐదు జిల్లాల్లో రెడ్ అలెర్ట్

By Arun Kumar PFirst Published Sep 7, 2021, 10:13 AM IST
Highlights

తెలంగాణలో మరో రెండురోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇవాళ ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 

హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాయశయాలు, చెరువులు నిండుకుండల్లా మారడంతో పాటు నదులు, వాగులు, వంకలు ఉద్రుతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తిపోతుంటే మరో రెండురోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలలో కొనసాగుతోంది. రానున్న నాలుగురోజుల్లో ఇది పశ్చిమవాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే తెలంగాణతో పాటు కోస్తాంద్రలో నేడు(మంగళవారం) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో అయితే అతిభారీ వర్షాలు కురుసే అవకాశం వుందని వాతావరణశాఖ హెచ్చరించింది. 

read more  భారీ వర్షాలు: హైద్రాబాద్‌లో నీట మునిగిన 250 కాలనీలు

తెలంగాణలో మంగళవారం ఐదు జిల్లాల్లో, బుధవారం నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇవాళ పెద్దపల్లి,  భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, రేపు అంటే బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలరించాలని సూచించారు. 

కేవలం ఈ జిల్లాల్లోనే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ రెండురోజులు సాధ్యమయినంత వరకు ఇళ్లలోనే వుండాలని...అత్యవసరం అయితే తప్పబయటకు వెళ్లరాదని సూచించారు. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. 

click me!