
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సయిన ఘటనపై రేపు ప్రత్యేకాధికారి విచారణ జరపనున్నారు. హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకాధికారి రేపు ధర్మపురికి రానున్నారు. కాగా.. 2018 తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరుపుతున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను తెరిచి నాటి ఎన్నికకు సంబంధించి 17ఏ, 17 సీ డాక్యుమెంట్ కాపీలు, సీసీ కెమెరా ఫుటేజ్, ఎన్నికల ప్రొసీడింగ్స్ను సమర్పించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి తాళాలు మిస్సయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ కంట్రోల్లో వుండాల్సిన తాళం చేతులు మాయం కావడం ఏంటని లక్ష్మణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకాధికారి రానున్నారు.