
బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ను హత్య చేసిన విషయం.. తన స్నేహితుడు, స్నేహితురాలు, తండ్రికి నిందితుడు చెప్పాడు. ఇంత జరిగినా వీరిలో ఏ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడంతో.. ఉన్నతాధికారులు ఈ ముగ్గురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అన్నింటికి మించి హరిహరకృష్ణ స్నేహితురాలు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది.
ALso REad: రక్తపు దుస్తులతో స్నేహితుడి వద్దకు హరిహరకృష్ణ: నవీన్ హత్య కేసులో కీలక విషయాలు
ఇప్పటికే మూడు సార్లు ఆమెను విచారించగా.. నోరు విప్పకపోవడంతో పోలీసులు ఆమెను సఖి సెంటర్లో కౌన్సెలింగ్కు పంపారు. అయినప్పటికీ ఆ అమ్మాయి తీరు మారలేదని సమాచారం. ఈ క్రమంలో తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నిందితుడు హరిహరకృష్ణను కస్టడీకి తీసుకుని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దర్యాప్తును త్వరగా కొలిక్కి తీసుకురావాలని పోలీసులు భావిస్తు్నారు. మరోవైపు.. హరిహరకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ఇకపోతే.. నవీన్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 50కిపైగా సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య కేసు విషయమై హరిహరకృష్ణ నుండి సమాచారం సేకరించడంతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోన్ డేటాను హరిహరకృష్ణ డిలీట్ చేసినట్టుగా పోలీసులు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు నవీన్ ఫోన్ ఇంకా లభ్యం కాని విషయాన్ని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ ఫోన్ విషయం కూడా హరిహరకృష్ణకు తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ALso REad: బ్యాగులో శరీర బాగాలు, లవర్ కి సమాచారం: హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
కాగా.. ఇంటర్మీడియట్ చదివే రోజుల నుండే నవీన్, హరిహరకృష్ణ లు స్నేహితులు. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇంటర్ లో చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉన్న అమ్మాయితో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ అంశమే వీరిద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. ఈ క్రమంలో నవీన్ పై హరిహరకృష్ణ అక్కసును పెంచుకున్నాడు. నవీన్ ను హత్య చేస్తే లవర్ తనకు దక్కుతుందని హరిహరకృష్ణ భావించాడు. దీంతో నవీన్ ను హైద్రాబాద్ కు రప్పించి హత్య చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయాన్ని హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో పోలీసలుు తెలిపారు.