దళితబంధు ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు.. త్వరలోనే అధికారిక ప్రకటన..?

By Siva KodatiFirst Published Oct 5, 2021, 7:10 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu)ను దళితబంధు (dalit bandhu scheme) చైర్మన్‌గా నియమించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి ఆయన పేరు దాదాపుగా ఖరారైంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu)ను దళితబంధు (dalit bandhu scheme) చైర్మన్‌గా నియమించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి ఆయన పేరు దాదాపుగా ఖరారైంది. మరో మూడు నాలుగు రోజుల్లో మోత్కుపల్లి టీఆర్ఎస్‌ (trs)లో చేరనున్నారు. గులాబీ పార్టీలో చేరిక తర్వాత మోత్కుపల్లి పేరుని దళిత బంధు ఛైర్మన్‌గా కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పదవి గురించి మోత్కుపల్లికి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. మంగళవారం ఉదయం కేసీఆర్ మోత్కుపల్లిని అసెంబ్లీ కి స్వయంగా వెంటబెట్టుకొచ్చారు. ఉదయం నుండి మోత్కుపల్లి సీఎం కేసీఆర్‌తోనే అసెంబ్లీలో ఉన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలం క్రితం టీడీపీ(tdp) నుంచి బీజేపీ (bjp)లో చేరారు. ఈ సమయంలో కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏకంగా అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు మోత్కుపల్లి. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని నర్సింహులు పిలుపునిచ్చారు. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది.

Also Read:దళితబంధు: మరో నాలుగు మండలాలు ఎంపిక చేసిన కేసీఆర్ సర్కార్

అయితే ఆయన టీఆర్ఎస్‌లో చేరితే ఏ రకమైన పదవి వస్తుందో అనే చర్చ కూడా సాగింది. సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులకు కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లి నర్సింహులును చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ ముందునుంచే అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు ఊతమిచ్చే విధంగానే గడిచిన కొన్నిరోజులుగా పరిణామాలు జరుగుతున్నాయి. 

కాగా, గతంలో టీడీపీలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి అనేక సందర్భాల్లో గట్టిగా విమర్శించారు. మిగతా నాయకులకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్.. అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఎదుర్కోవడంతో మాత్రం ఇబ్బందిపడిందనే వాదన ఉంది. అలాంటి మంచి వాగ్థాటి  వున్న మోత్కుపల్లికి దళితబంధు అమలుకు సంబంధించిన కీలక పదవి ఇవ్వడం ద్వారా.. ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళతారని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాజకీయాల్లో మళ్లీ ఓ వెలుగు వెలగాలని ఎదురుచూస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

click me!