ఇంటి ముందు మూడు కార్లు ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పేదవాడా అని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరాధ్యక్షుడు ఎంన్ శ్రీనివాస రావు ప్రశ్నించారు.
హైదరాబాద్: ఇంటి ముందు మూడు కార్లు ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పేదవాడా అని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరాధ్యక్షుడు ఎంన్ శ్రీనివాస రావు ప్రశ్నించారు. మోత్కుపల్లి వయస్సుకు గౌరవమిస్తున్నామని, గత మరిచి మాట్లాడకూడదని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎక్కడో ఉన్న మోత్కుపల్లికి రాజకీయ భిక్ష పెట్టి ఇంతటి వాడిని చేసింది టీడీపీ, చంద్రబాబునాయుడు అని ఆయన అన్నారు. విచక్షణ మరిచి నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. మోత్కుపల్లి.. ఖబడ్దార్ ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీని, చంద్రబాబునుద్దేశించి మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అర్ధరహితమన్నారు.
శాసనసభ్యుడిగా అవకాశం కల్పించి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీని విమర్శించడం విశ్వాస ఘాతుకమని ఆన అన్నారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలతో అంటకాగిన మోత్కుపల్లికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని అన్నారు. గవర్నర్ పదవి కోసం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కనిపించిన వారి కాళ్లా, వేళ్లా పడ్డావని, చివరకు రాజ్యసభ కూడా దక్కకపోవడంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నారని అన్నారు.
బీద దళితుడినంటూ జాతిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు బంగ్లా, ఇంటి ముందు మూడు కార్లు ఉన్న నీవు పేదవాడివెలా అవుతావని ఆయన మోత్కుపల్లిని ప్రశ్నించారు. కుక్క, నక్క అని తీవ్ర పదజాలంతో అప్పట్లో మోత్కుపల్లి సీఎం కేసీఆర్ను విమర్శించారని, ఇప్పుడు కేసిఆర్ మహానుభావుడిగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు.
పదవులు ఇచ్చి ప్రజల్లో ఆదరణ పెంచిన చంద్రబాబు కానివాడయ్యారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్యాకేజీల రాజకీయాలకు స్వస్తి పలికి, దళిత జాతి కోసం పని చేయాలని ఆయన మోత్కుపల్లికి హితవు చెప్పారు