
మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ భేషరతు క్షమాపణ చెప్పారు. కలెక్టర్ తనకు చెల్లి లాంటిదని చెప్పారు. బుధవారం హరిత హారం కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతిమీనా చేయి పట్టుకున్నాడని ఆరోపించారు కలెక్టర్. ఎమ్మెల్యే తీరుపై సిఎస్ ఎస్పీ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఐఎఎస్ అధికారుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో విషయం సిఎం కెసిఆర్, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి నోటీసుకు చేరింది.
సిఎం ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి కూడా క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సూచించారు.
దీంతో అన్నివైపులా వత్తిడి రావడంతో శంకర్ నాయక్ కలెక్టరేట్ కు వెళ్లి ఆమెను కలిసి క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉండగా శంకర్ నాయక్ మీద చర్యలు తీసుకోవాలని, తక్షణమే అరెస్టు చేయాలని పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతకుముందు నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేశారు. మొత్తానికి శంకర్ నాయక్ క్షమాపణతో వివాదం సద్దుమనిగినట్లే కనిపిస్తోంది.