భవనంపై నుంచి దూకిన ప్రేమ జంట.. బాలుడు మృతి

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 10:14 AM IST
Highlights

తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించరేమోననే భయంతో ఓ ప్రేమ జంట భవనంపై నుంచి కిందకు దూకేశారు.

తమ ప్రేమను పెద్దవాళ్లు అంగీకరించరేమోననే భయంతో ఓ ప్రేమ జంట భవనంపై నుంచి కిందకు దూకేశారు. వారిలో బాలుడు మృతి చెందగా.. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...స్థానిక బాపూజీ నగర్‌కు చెందిన బాలిక, కేటీపీఎస్‌ ఇంటర్మీడియట్‌ కాలనీకు చెందిన పోశం మణికంఠలు ఆదివారం స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అమ్మాయి స్థానికంగా ఓప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అబ్బాయి డిప్లొమా చదువుతున్నట్లు సమాచారం. సాయంత్రం ఆరు-ఏడు గంటల మధ్యలో ఈ జంట భవనం పైనుంచి దూకింది.

 అదేసమయంలో ఆ మార్గంలో వెళుతున్న స్థానికులు వీరిని చూసి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు, ఛాతీ, ఇతర శరీరభాగాలకు తీవ్ర గాయాలైన మణికంఠ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతణ్ని ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఏన్కూరు వద్ద చనిపోయాడు. కాళ్లు, చేతులు విరిగి, ముఖానికి తీవ్ర గాయాలైన బాలిక బాధతో కేకలు వేస్తోంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లారు. ప్రేమ వ్యవహారమే ఈ ఉదంతానికి కారణమని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

click me!
Last Updated Sep 24, 2018, 10:14 AM IST
click me!