
దేశంలో నరేంద్రమోడీ (Narendra Modi) రాజ్యాంగం(Constitution) నడుస్తోందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) . ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. బీసీ ప్రధానిగా ఉండి కూడా బీసీ మంత్రిత్వశాఖను పెట్టకపోవడం శోచనీయమని తలసాని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వల్ల కనీసం ఉద్యోగులకు సైతం ఉపయోగం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ- కాంగ్రేస్ కుక్కల్లా మొరుగుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటల్ బిహారీ వాజ్పాయి బీజేపీలో మనిషి కాదా? ఎందుకు రాజ్యాంగ పున: పరిశీలన కోసం కమిషన్ వేశారని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు.
అంబేద్కర్ను కించపరిచిన అరుణ్ శౌరి లాంటి వ్యక్తులకు మంత్రి పదవులు బీజేపీ ఇచ్చింది వాస్తవం కాదా? అని తలసాని ప్రశ్నించారు. బీజేపీ-కాంగ్రేస్ నేతలు ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ కావాలని ముఖ్యమంత్రి అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ నిజమైన వారసులం కాబట్టే.. సబ్ ప్లాన్, దళితబంధు తెచ్చామని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక లక్ష రూపాయలైనా ఖర్చు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తలసాని వార్నింగ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి తెచ్చింది ఏంటి అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ప్రధాని ఇంటిముందు ధర్నా చేయాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రయోజనాలు తెస్తే బీజేపీ ఎంపీలకు ఎయిర్ పోర్ట్ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామని తలసాని అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం KCR వ్యాఖ్యలను నిరసిస్తూ New Delhi లోని తెలంగాణ భవన్ ఆవరణలోని Ambedkarవిగ్రహం వద్ద BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay గురువారం నాడు మౌన దీక్షకు దిగాడు. ఈ దీక్షకు ‘బీజేపీ బీమ్ దీక్ష’ అని పేరు పెట్టింది. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై కేసీఆర్ ప్రజలకు క్షమానణ చెప్పాలని ఆయన కోరారు. అహంకారపూరితంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయని సంజయ్ విమర్శించారు.