
Telangana: హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ (NTR Gardens)లో త్వరలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr BR Ambedkar).. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఏర్పటు గురించి వెల్లడించారు. "హైదరాబాద్లో, ఒకవైపు IMAXతో కూడిన అత్యుత్తమ 2BHK హౌసింగ్ సైట్లలో ఇదొకటి, కొత్త సెక్రటేరియట్ను నిర్మిస్తున్నాం. అలాగే, 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr BR Ambedkar) విగ్రహం త్వరలోనే ఏర్పాటు చేస్తాం" అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖైరతాబాద్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ల్యాండ్ పార్శిల్లో ఫంక్షన్ హాల్ నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఎకరం విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎండీఏ భూమిని వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది ఆదాయాన్ని ఆర్జించగలిగినప్పటికీ, పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని మంత్రి చెప్పారు. గురువారం ప్రారంభించిన ఇందిరా నగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నాలుగు బ్లాకుల్లో 210 నివాస గృహాలు ఉన్నాయి. సీసీ రోడ్డు, తాగునీరు, ఏడు లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.1,785 లక్షలతో నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ 2BHK హౌసింగ్ పథకం కింద నిర్మించబడింది.
ఇదిలావుండగా, కొల్లూరులో ఒకేచోట 15,640 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో కొల్లూరులోని ఇండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు (సీఎం కేసీఆర్) ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ తో పాటు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో మూడు వందల కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం నాడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జవహర్ నగర్ లో చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union budget 2022) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ (Telangana)కు అన్యాయం చేశారని తెలిపారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికి వచ్చేది ఒక్కటీ లేదని అన్నారు.