సీఎం కేసీఆర్ కంటే కార్మికుల ప్రాణాలకే ప్రాధాన్యతిచ్చి... మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

Published : Jun 13, 2023, 11:27 AM ISTUpdated : Jun 13, 2023, 11:33 AM IST
సీఎం కేసీఆర్ కంటే కార్మికుల ప్రాణాలకే ప్రాధాన్యతిచ్చి... మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

సారాంశం

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 

గద్వాల : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో పాల్గొనడం కంటే సాటి మనుషుల ప్రాణాలు కాపాడేందుకే ప్రాధాన్యత ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిన్న(సోమవారం) జోగులాంబ గద్వాల జిల్లాకు మంత్రి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయి గాయాలపాలైన క్షతగాత్రులను గమనించారు. సీఎం పాల్గొనే కార్యక్రమాల కోసం బిజీబిజీగా వెళుతున్న శ్రీనివాస్ గౌడ్ సాటి మనుషులు ప్రాణాపాయ స్థితిలో పడివుండటం చూసి ముందుకు వెళ్లలేకపోయారు. వెంటనే తన కారు నిలిపి స్వయంగా క్షతగాత్రులకు హాస్పిటల్ కు తరలించి ఆ తర్వాతే అక్కడినుండి వెళ్లారు. ఇలా మంత్రి బాధ్యతల కంటే మానవత్వమే గొప్పదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాటిచెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కేసీఆర్ సర్కార్ ఏర్పాటుచేస్తోంది. నిర్మాణం పూర్తయిన కార్యాలయాలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఇలా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుండి గద్వాల వెళుతుండగా మార్గమధ్యలో ఓ ప్రమాదాన్ని గమనించారు. బెంగళూరు హైవేపై వేగంగా వెళుతున్న బొలేరో వాహనం వనపర్తి జిల్లా పెద్ద మందడి వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి కిందపడిపోయింది. దీంతో అందులోని వారు తీవ్ర గాయాలపాలయ్యారు. 

వీడియో

ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎం పాల్గొనే అధికారిక కార్యక్రమాల కోసం గద్వాలకు బిజీబిజీగా వెళుతున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చూసి చలించిపోయిన మంత్రి తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనపెట్టారు. వెంటనే తన కారును ఆపి స్ధానికుల సాయంతో క్షతగాత్రులను ముందుగా హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేసారు. స్వయంగా తానే గాయపడిన ఓ కార్మికురాలి చేయి పట్టుకుని ఆటో ఎక్కించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. 

Read More  దిక్కుమాలిన రాజకీయాలకోసం పథకాలు పెట్టలేదు: గద్వాల కలెక్టరేట్ ప్రారంభించిన కేసీఆర్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కూడా క్షతగాత్రులకు సహాయం అందించారు. స్థానిక పోలీసులు, వైద్యసిబ్బందితో మాట్లాడి అంబులెన్స్ లు ఏర్పాటుచేసి క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. సమయానికి వైద్యం అందడంతో ప్రమాదంలో గాయపడినవారికి ప్రాణాపాయం తప్పింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు వెళ్లడం ఆలస్యమయినా సాటి మనుషుల ప్రాణాలు కాపాడేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాపత్రయపడ్డారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు. తమవారిని కాపాడిన మంత్రికి క్షతగాత్రుల కుటుంబసభ్యులు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?