
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr birth day) పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు ఉన్నతాధికారులు మెమో ఇచ్చిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన స్పందించారు. మున్సిపల్ కమీషనర్ మెమో జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి బాధ్యుడైన బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ను సస్పెండ్ చేయాలని ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ను ఆదేశించారు. ఆ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
Also REad:కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వలేదని.. ముగ్గురు ఉద్యోగులకు మెమో
కాగా.. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వాట్సాప్ సందేశం పంపారు అధికారులు. అయితే కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా టి రాజేశ్వరి (సీనియర్ అసిస్టెంట్), పున్నం చందర్ (జూనియర్ అసిస్టెంట్), మోహన్ (సిస్టమ్ మేనేజర్)లకు మెమోలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అటు ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా మండిపడింది. ఒక అవినీతి పరుడి పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పర్వదినమా, అంత మాత్రానికే చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపుతారా అంటూ ఫైర్ అయ్యింది. ఈ మేరకు సదరు మెమోను ట్వీట్ చేసింది.