
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం (telugu desam party) దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన కరకట్టలే ఇటీవల గోదావరి వరదల (godavari floods) నుంచి భద్రాచలాన్ని (bhadrachalam) కాపాడాయన్నారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఇటీవల భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పోలవరం ముంపు మండలాల్లో ఆయన పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం రాత్రి భద్రాచలంలో బస చేసిన చంద్రబాబు.. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం, గోదావరి కరకట్టలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే రాజకీయ నేతలు భవిష్యత్కు బాటలు వేసిన వారవుతారని వ్యాఖ్యానించారు.
గోదావరి వరదలతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులను ప్రభుత్వాలే అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వరద బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఉండే పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం గోదావరి కరకట్ట నిర్మించామని ఆయన గుర్తుచేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పనులు చేశామని... 1986లోనూ వరదలు వస్తే భద్రాచలం ముంపునకు గురైందని చంద్రబాబు వెల్లడించారు. మనం చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందని.. భవిష్యత్తులో విపత్తు లేకుండా పనులు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also REad:అనుకూల వాతావరణం, సెప్టెంబర్లో ఖమ్మంలో భారీ సభ: టీడీపీ నేతలతో చంద్రబాబు
అంతకు ముందు చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద టీడీపీ అధినేతకు ఈవో ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబుకు ఉపాలయంలో వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం, శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ రామయ్యను దర్శించుకున్నారు.