కేటీఆర్ పెద్ద మనసు: ఐఏఎస్ అభ్యర్ధి ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి ఆర్ధిక సాయం

By Siva KodatiFirst Published Jul 8, 2021, 8:38 PM IST
Highlights

ఆత్మహత్యకు పాల్పడిన ఐఏఎస్ అభ్యర్ధి ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున 2.50 లక్షల ఆర్ధిక సాయంతో పాటు షాద్ నగర్‌లో ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు  చేస్తామని ప్రకటించారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, ఐశ్వర్య రెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన లాప్‌టాప్ కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు ఎంచుకున్న తన లక్ష్యం, ఉన్నత చదువు దూరమవుతుందేమోనన్న బాధతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె కుటుంబం, పేదరికంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని తాజాగా పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కూతురు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనలో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు కేటిఆర్ ముందుకు వచ్చారు. ఈరోజు వారిని ప్రగతి భవన్ కి పిలిపించి 2 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ పరిస్థితులను వారి బాగోగులను కేటీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. షాద్ నగర్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికాన్ని జయించి దేశంలోనే ప్రముఖ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. 

Also Read:ఎమ్మెల్యేలను కొనడం నీకంటే బాగా ఎవరికి తెలుసు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

మంత్రి కే తారక రామారావు చూపిన ఉదారత పట్ల ఐశ్వర్య రెడ్డి కుటుంబం  కృతజ్ఞతలు తెలిపింది. కూతురుని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తాము కోలుకోలేదన్నారు. తమ కుటుంబానికి చేసిన సహాయం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటామని వారు ఉద్వేగానికి లోనయ్యారు.
 

click me!