
తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం తమకు ఉందన్నారు. హైదరాబాద్లో అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. చైర్మన్ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు, తెలంగాణ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఇతర శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగంలోని మార్పులను దేశం అందిపుచ్చుకోవాలని సమావేశంలో కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ-కామర్స్పై జాతీయపరమైన పాలసీని సత్వరమే తీసుకురావాలన్నారు. ఈ-కామర్స్కు ముడిపడి ఉన్న ఆన్లైన్ మోసాలపై విధానాలు ప్రకటించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్, అత్యుత్తమ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండడం వంటి అంశాపై కేంద్రం నిర్ణయాలను ప్రకటించాలన్నారు. సిటిజన్ సర్వీస్ డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలని సూచించారు.
ఈ-కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని భారీగా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా అందిపుచ్చుకోవడంలో భారత దేశ ప్రజలు ముందు వరుసలో ఉంటారన్నారు. పెద్ద ఎత్తున ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లిటరసీపైన దృష్టి సారించాలన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి అవసరమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు. సైబర్ నేరాల కట్టడి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణప్రభుత్వం నల్సార్ వర్సిటీతో చట్టరూపకల్పన ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా వచ్చిన విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని, కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. వంటి అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అడిగిన అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడంపైన అత్యంత విశ్వాసం కలిగి ఉందని.. ఈ దిశగా ఆదిలాబాద్లోని సీసీఐని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఎస్ఎంఈలకు పెద్దఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు.
తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం తమకు ఉందన్నారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు.