హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే... ఇలా చేస్తాం, ఓటర్లకు హరీశ్ హామీలు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 3:11 PM IST
Highlights

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో (huzurabad bypoll) టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ 57 ఏళ్లకు పెన్షన్, 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు.

బీజేపీపై (bjp) మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు (harish rao).  ఆదివారం హుజూరాబాద్‌ (huzurabad).నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ధూంధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... నిత్యావసర సరకుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో జనం బాధలు పడ్డా ఫరవాలేదని.. మీరు మాత్రం నాకే ఓటేయాలని ఈటల రాజేందర్‌ (etela rajender) అడుగుతున్నారని హరీశ్ విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదని ఆయన దుయ్యబట్టారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అయిపోగానే కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ధరను (gas price) మరో రూ.200 పెంచుతుందని హరీశ్ ఆరోపించారు. బీజేపీకి ఓటేస్తే సిలిండర్‌ ధర రూ.1500 అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రైతులు, సామాన్యులను పీడిస్తోందని ఆ పార్టీని బొంద పెడితేనే సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయన్నారు. రైతుబంధు (rythu bandhu) , రైతుబీమాతో (rythu bheema) రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని హరీశ్ ప్రశంసించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సీఎం కేసీఆర్‌ తమ జీతాలకు కోత పెట్టారని చెప్పారు. ఈటల రాజేందర్‌ ఏడేళ్లుగా మంత్రిగా ఉన్నా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కూడా కట్టలేదని హరీశ్ విమర్శించారు.

ALso Read:Huzurabad by poll: టీఆర్ఎస్‌కి గుర్తుల టెన్షన్, పక్కా వ్యూహాంతో గులాబీ దళం

వ్యవసాయ మోటార్లకు బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే వద్దని చెప్పి.. మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారని మంత్రి గుర్తుచేశారు. రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మాట మార్చాడని హరీశ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ లేకపోతే అసలు ఈటల రాజేందర్‌ అనే వాడు ఉన్నడా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం ఈటల పచ్చి మోసపు మాటలు, అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లో ఒక్క రూపాయి పని చేయని ఎంపీ అరవింద్‌.. హుజూరాబాద్‌లో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని హరీశ్ దుయ్యబట్టారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో (huzurabad bypoll) టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ 57 ఏళ్లకు పెన్షన్, 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని హరీశ్ రావు సవాలు విసిరారు.
 

click me!