
తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించేందుకు తెలంగాణకు వస్తున్నారని అన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని పాత ఐదు మెడికల్ కాలేజీల్లోనే అక్కడి విద్యార్ధులకు 15 శాతం సీట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అదే మన దగ్గర కొత్తగా ఏర్పాటైన 26 మెడికల్ కాలేజీల్లో 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్ధులకు అందుబాటులో వున్నాయని హరీశ్ పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని.. ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని హరీశ్ రావు చెప్పారు.
Also Read: కోకాపేటలో భూములకు రికార్డు ధర చూసైనా కళ్లు తెరవాలి: విపక్షాలపై కేటీఆర్ సెటైర్లు
కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించామని ఆయన వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజ్లు ప్రారంభం కానున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో 2 మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేశాయని.. కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలో 29 మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోందని మంత్రి అన్నారు.