
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై సెటైర్లు వేశారు మంత్రి గంగుల కమలాకర్ . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్ధులు దొరకని పరిస్ధితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించడంతో విపక్షాల కాళ్ల కింద భూమి కంపిస్తోందని ఎద్దేవా చేశారు. దొంగలను, రౌడీషీటర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోందని గంగుల కమలాకర్ ఆరోపించారు. కాంగ్రెస్లో దరఖాస్తులను అమ్ముకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు . ఒకేసారి 50 మంది అభ్యర్ధులను ప్రకటించే దమ్ము రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు వుందా అని గంగుల ప్రశ్నించారు.
అంతకుముందు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు. గాల్లో పాలన మాదిరిగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తూ జాబితా ప్రకటించారని.. అయితే ఎన్నికల సమయానికి అందులో సగం మందికి టికెట్లు ఇవ్వకుండా ఎగ్గొడతాడని ఆరోపించారు.
Also Read: అందుకే గవర్నర్తో కేసీఆర్ సయోధ్య.. ఎన్నికలు రాగానే అమలు కాని హామీలు: బండి ఫైర్
ఎన్నికలు రాగానే కేసీఆర్ అమలు కానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో.. బీఆర్ఎస్ గెలిపిస్తే ఒక్కో కుటుబానికి చంద్రమండలంలో మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే కోటీశ్వరులు అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చంద్రమండలంపై ఎలాంటి దందా చేయవచ్చు అని ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు.
గవర్నర్కు భయపడే సీఎం కేసీఆర్ సయోధ్యకి వచ్చారన్నారు. బిల్లుల ఆమోదం కోసమే గవర్నర్తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీఎం కేసీఆర్లు అన్నదమ్ములని అని సెటైర్లు వేశారు.