రెండో పెళ్లి చేయడం లేదని తల్లిని గొడ్డలతో నరికి చంపాడు..

By Bukka SumabalaFirst Published Sep 16, 2022, 10:25 AM IST
Highlights

ఓ కొడుకు దారుణానికి తెగించాడు. రెండో పెళ్లి చేయడం లేదని తల్లిని గొడ్డలితో నరికి అతి దారుణంగా చంపాడో కొడుకు.

కామారెడ్డి : రెండోపెళ్లి చేయడంలేదనే కోపంతో తల్లినే నరికి చంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగా గ్రామంలో చోటు చేసుకుంది. మొగ గ్రామానికి చెందిన పింజరి ఇస్మాయిల్ బీ (55), మహబూబ్ సాబ్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అల్లావుద్దీన్ గ్రామంలో వేరే ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. చిన్న కొడుకు సల్లావుద్దీన్ తో తల్లిదండ్రులు ఇస్మాయిల్ బీ, మహాబూబ్ సాబ్ కలిసి ఉంటున్నారు. 

ఎనిమిదేళ్ల క్రితం సల్లా వుద్దీన్ కు వివాహం జరగగా, రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత అతడు హైదరబాద్ లోని ఫంక్షన్ హాల్ లో కొంతకాలం కూలిపని చేశాడు. రెండు నెలలుగా అతడు గ్రామంలోనే ఉంటూ ఇంటి నిర్మాణపనులకు దినసరికూలిగా వెల్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం మద్య సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. పెళ్లి విషయమై బుధవారం సాయంత్రం తల్లితో మరోసారి గొడవపడి బయటికి వెళ్లాడు. అర్థరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తల్లి మెడపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి మరో గదిలో నిద్రపోతున్నాడు.

తాహతుకు మించి అప్పులు.. ఒత్తిడి తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య...

దొంగలు హత్య చేశారంటూ... 
తల్లిని హత్య చేసిన తర్వాత సల్లావుద్దీన్ భయాందోళనకు గురయ్యాడు. హత్య కేసు తనపైకి రాకుండా ఉండేందుకు పథకం వేశాడు. తల్లిని దొంగలు హత్య పారిపోయారంటూ గట్టిగా అరుస్తూ రోదించాడు. తండ్రి వద్దకు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మను హత్య చేసి పారిపోయారని చెప్పాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

తన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసుల ఎదుట సల్లావుద్దీన్ వాపోయాడు. పోలీసులు అనుమానంతో అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. గురువారం బిచ్కుంద సీఐ కృష్ణ, క్లూస్ టీం సభ్యులు ఘటనాస్తలం వద్ద వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!