
హైదరాబాద్ : కులంపేరుతో దూషించారని ఓ యువకుడు మనస్థాపతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. ఈ విషాదఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడు గోపి నాయక్. అతడి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేలోతు జగ్రు నాయక్, విజయలక్ష్మి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కేలోతు తండాకు చెందినవారు.
అక్కడి నుంచి వారు బతుకుతెరువు కోసం నగరంలోని గుర్రంగుడకి వలస వచ్చారు. గుర్రంగుడా సమీపంలో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు గోపినాయక్(26). అతడికి 2018లో గుర్రంగూడాలోని రాజిరెడ్డి కాలనీలో నివాసం ఉండే 21యేళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. తరువాత కాలంలో అది ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో గోపీనాయక్ లండన్ వెళ్ళాడు.
ప్రైవేట్ కంపెనీలో మేనేజర్తో వర్కర్ శారీరక సంబంధం.. గర్భం దాల్చిన తర్వాత హత్య.. హైదరాబాద్లో ఘటన
అప్పుడు కూడా వారిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. ఏడాది క్రితం చదువు మధ్యలో ఆపేసి గోపీనాయక్ నగరానికి తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఇంట్లోని పెద్దవాళ్లతో చెప్పకుండా వీరిద్దరూ రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఎవరింటికి వారు వెళ్ళిపోయి ఉంటున్నారు.
పెళ్లయిన రెండు నెలల తర్వాత యువతి.. గోపి నాయక్ ఇంటికి వచ్చింది. దీంతో గోపీనాయక్ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని నిలదీశారు. తాను గోపి నాయకులు పెళ్లి చేసుకున్నానని చెబుతూ.. రహస్యంగా గుళ్లో కట్టిన తాళిని చూపించింది. దీంతో యువతికి, గోపినాయక్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఆమెను ఎలాగో ఒప్పించి తిరిగి పంపించారు.
దీని తర్వాత విషయం యువతి కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. ఒకే కాలనీలో ఉంటుండడం వల్ల యువతీ తల్లిదండ్రులకు, యువకుడు తల్లిదండ్రులకు మధ్య తరచుగా ఈ విషయంగా గొడవలు జరుగుతుండేవి. యువతి తల్లిదండ్రులు గోపి నాయక్ ను కులం పేరుతో దూషించేవారు. గత నాలుగు నెలలుగా ఇలా జరుగుతోంది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గోపీనాయక్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో.. మృతుడి కుటుంబీకులు న్యాయం చేయాలంటూ ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేశారు. గోపి నాయక్ తండ్రి ఫిర్యాదు మేరకు యువతి కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.