
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్కు మూవ్ కావడం వల్ల రూ. 40 వేల ఖర్చు ఆదా చేసుకోవచ్చని అతడు పేర్కొన్నాడు. దీంతో నెట్టింట ఈ పోస్టుపై పెద్ద చర్చే సాగుతుంది. వివరాలు.. పృద్వీ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్..బెంగుళూరు నుంచి హైదరాబాద్కు మారడం వల్ల నెలకు 40 వేలు ఖర్చులు ఆదా అయ్యాయని పోస్టు చేశాడు. ఆ డబ్బుతో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చని అన్నాడు. కుటుంబ విలువలు సరిపోలినప్పుడు.. ఒంటరిగా జీవించడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా అతను చెప్పాడు.
ఈ పోస్ట్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ గురించి కాదని కూడా పృద్వీ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని విషయాలలో తాను బెంగళూరు స్థానికులకు మద్దతునిచ్చానని చెప్పారు. అందుకే బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అనే కాన్సెప్ట్పై చర్చించడం మానుకోవాలని కూడా సూచించాడు.
పృద్వీ రెడ్డి పోస్ట్కి సోషల్ మీడియా వినియోగదారుల నుండి అనేక స్పందనలు వచ్చాయి. ఆయన ఆలోచనలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘‘ఈ విషయం పేర్కొనలేదు.. మీరు బెంగుళూరులోని ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్లోని ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు ఎలా ప్రయాణం చేస్తారు? ఎందుకంటే మెట్రో/బస్ పాస్లు చాలా చౌకగా ఉంటాయి. హైదరాబాద్లో అద్దె తక్కువ అన్నది పాత సామెత’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ రూ. 40 వేలు అద్దె ఒక్కటేనా అని ప్రశ్నించగా.. ‘‘అద్దె + నిర్వహణ + నీరు, విద్యుత్ బిల్లులు + ఆహారం’’ అని పృద్వీ రెడ్డి బదులు ఇచ్చారు.
అయితే చాలా మంది పృద్వీ రెడ్డిని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా భావించారు. అయితే దీనిపై స్పందించిన పృద్వీ రెడ్డి.. తాను బెంగళూరుకు చెందినవాడిని కాదని అన్నారు. తాను హైదరాబాదీనని చెప్పారు. తాను ఒక్క సంవత్సరం బెంగళూరులో ఉండి తిరిగి వచ్చానని పేర్కొన్నారు.