
Telangana: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్-Telangana Rashtra Samiti-TRS) నేతలకు చెందిన తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ (Namaste Telangana) ఎడిటర్కు లోక్సభ సెక్రటేరియట్ ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. డిప్యూటీ సెక్రటరీ బాల గురు. జీ నోటీసులను జారీ చేశారు. దినపత్రికపై 'ప్రత్యేక హక్కు ఉల్లంఘన' మరియు 'సభను ధిక్కరించారు' అనే ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్కు వివరణ ఇవ్వాలని నమస్తే తెలంగాణ ఎడిటర్ను కోరారు.
భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే (Telangana Today), ఆంగ్ల దినపత్రిక, టీ న్యూస్ ఛానల్ (T News channel)పై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ (Bandi Sanjay Kumar) ఆధ్వర్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార టీఆర్ఎస్ నేతలకు చెందిన వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానెల్లు తెలంగాణ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్థులను, ఇతరులను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.
టీఆర్ఎస్ (TRS) నేతలకు చెందిన మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) చేసిన వ్యాఖ్యలను కూడా టీఆర్ఎస్ మీడియా తప్పుగా వ్యాఖ్యానించిందని ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న మీడియా సంస్థపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కోరారు.
మీడియాను ఉపయోగించుకుని టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందనీ, ప్రకటనల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్నిసదరు మీడియా సంస్థకు చెల్లిస్తోందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, ఆంగ్ల దినపత్రిక, టీ న్యూస్ ఛానల్పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) కి ఫిర్యాదు చేసిన ఈ బృందంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులున్నారు.
కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేేపీ), అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ దూకుడుకు కళ్లెం వేసే క్రమంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. బీజేపీని ఈ దేశం నుంచి తరిమివేయాలంటూ ఘాటు విమర్శలతో విరుచుకుపడుతన్నారు. అలాగే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పలుమార్లు భేటీ అయ్యారు. వారందరూ కూడా త్వరలోనే హైదరాబాద్ లో సమావేశం కానున్నారని సమాచారం.