లాక్ డౌన్ "ఆందోళన"..... హైదరాబాద్ లో నలుగురి ఆత్మహత్య!

By Sree sFirst Published May 14, 2020, 8:38 AM IST
Highlights

ఇన్ని రోజులైనా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉండడం, ఇండ్లకు వెళ్లలేకపోవడం అన్ని వెరసి వారిలోని మానసిక ఆందోళనలు ఎక్కువై ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

లాక్ డౌన్ వల్ల చాలామంది వారి ఇళ్ల నుండి దూరంగా చిక్కుకుపోయారు. కొందరేమో ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్నవారయితే.... మరికొందరు పనులమీదనో..,. ఎవరినో చూడడానికో వెళ్లి చిక్కుకుపోయారు. 

ఇన్ని రోజులైనా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉండడం, ఇండ్లకు వెళ్లలేకపోవడం అన్ని వెరసి వారిలోని మానసిక ఆందోళనలు ఎక్కువై ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

నిన్న ఒక్కరోజే ఇలాంటి పరిస్థితుల్లో కేవలం హైదరాబాద్ లోనే నలుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇలా ఉంటే.... దేశం మొత్తంలో పరిస్థితి ఎలా ఉందొ మనం ఊహించుకోవచ్చు. 

అపార్ట్మెంట్ పై నుంచి దూకి.... 

20 ఏళ్ల యువతి. హైదరాబాద్ లో పని చేస్తుంది. తన సొంత అక్కకు ఊరిలో బాబు పుట్టాడని తెలుసుకొని వెళ్దామనుకుంది. కానీ లాక్ డౌన్ వల్ల అది సాధ్యపడలేదు. సొంతవారిని, ఆప్తులను కలుసుకోలేనిజీవితం తనకెందుకని తాను పనిచేస్తున్న అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

నందిగామకు చెందిన శ్రీవల్లి ల్యాంకో హిల్స్ లో 15వ అంతస్తులోని ఒక ఇంట్లో పని చేస్తుంటుంది. సంతోషకరమైన వార్త తెలుసుకొని ఇంటికి వెళదామనుకొని అనుకుంటే... ఈ లాక్ డౌన్ వల్ల వెళ్లలేకపోవడంతో అదే 15వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలను విడిచింది. 

కొడుకు విదేశాల్లో చిక్కుకుపోయాడని...... 

కరోనా వైరస్ కారణంగా కొడుకు విదేశాల్లో చిక్కుకుపోవడం, అక్కడ కరోనా మరణాలు పెరుగుతూ ఉండడం, మార్చ్ లో వస్తానన్న కొడుకు రాలేకపోతున్నాను అని చెప్పడం ఇవన్నీ వెరసి ఒక తల్లి ఆసిడ్ తాగి మరణించింది. 

లక్ష్మి అనే 57 సంవత్సరాల మహిళా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఉంటుంది. కొడుకు సతీష్ కెనడాలో చిక్కుకుపోయారు. విమానాలు రద్దవడంతో రాలేకపోయాడు. మార్చ్ లోనే ఇంటికి వస్తానని చెప్పాడు. ఎప్పటి నుండో కొడుకును చూడాలని ఆత్రుతగాక్ ఎదురు చూస్తూ ఉంది ఆ మహిళ. కొడుకు రాలేకపోతుండడంతో అర్థరాత్రి ఆసిడ్ తాగి మరణించింది. 

సొంతూళ్లకు వెళ్లలేకపోతున్నామని ఇద్దరు.... 

రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళా ఇంటికి వెళ్లలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కూతురు మూడు సంవత్సరాల కింద మరణించినప్పటి నుండి ఆమె మానసికంగా కృంగిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. 

సూర్యాపేటకు చెందిన వెంకన్న అనే వృద్ధుడు లాక్ డౌన్ కి ముందు బర్కత్పురలోని కొడుకు ఇంటికి వచ్చాడు. రోజు రోజుకి లాక్ డౌన్ పొడిగిస్తునే ఉండడంతో..... సొంతూరికి వెళ్లగలనో లేదో అనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

click me!