రూ. 100 కోట్ల పరువు నష్టం :రేవంత్ , బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

By narsimha lodeFirst Published Mar 28, 2023, 7:25 PM IST
Highlights

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు   మంత్రి కేటీఆర్  ఇవాళ లీగల్ నోటీసులు పంపారు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో నిరాధార ఆరోపణలు  చేసినందుకు  క్షమాపణలు  చెప్పాలని  ఆయన  కోరారు.


హైదరాబాద్: టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు  తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారంనాడు  లీగల్ నోటీసులు పంపారు.  తనపై నిరాధార ఆరోపణలు  చేసినందుకు బహిరంగ క్షమాపణలు  చెప్పాలని  కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు.

 బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే  రూ, 100 కోట్లకు  పరువు నష్టం దావా  ఎదుర్కోవాల్సి వస్తుందని  మంత్రి కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్ అంశంపై  తనపై  నిరాధారమైన ఆరోపణలు  చేశారని  రేవంత్ రెడ్డి ,  బండి  సంజయ్ లపై కేటీఆర్ మండిపడ్డారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్  లీక్ అంశంలో  మంత్రి కేటీఆర్  కార్యాలయానికి  సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  అంతేకాదు  ఈ కేసుతో  మంత్రి రేవంత్ రెడ్డికి  సంబంధం ఉందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు   బండి  సంజయ్  ఆరోపించారు. 

ఈ కేసులో మంత్రి  కేటీఆర్  ను మంత్రివర్గం నుండి  భర్తరఫ్  చేయాలని  కూడా  డిమాండ్  చేశారు  కాంగ్రెస్, బీజేపీ నేతలు. ఐటీ శాఖను నిర్వహిస్తున్న కేటీఆర్  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్   కేసుకు బాధ్యత వహించాలని  ఈ ఇద్దరూ  నేతలు  డిమాండ్  చేశారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్  కమిషన్ పేపర్  లీక్  కేసులో  తనపై  ఈ ఇద్దరు నేతలు  దురుద్దేశ్యంతో  ఆరోపణలు  చేశారని   కేటీఆర్  ఆ నోటీసులో  పేర్కొన్నారు.  పేపర్ లీక్ కేసులో  తన  పేరును  ఉపయోగించడంపై  కేటీఆర్ మండిపడ్డారు.   సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలు చెబుతున్నారని  కేటీఆర్  ఆ నోటీసులో  పేర్కొన్నారు.  కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి పై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు  లేదన్నారు.  ఐపీసీ  499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు

also read:అర్వింద్‌ది ఫేక్ డిగ్రీ.. సంజయ్, రేవంత్‌లు ఒక్కసారైనా పరీక్ష రాశారా : పేపర్ లీక్ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్

 ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. 

click me!