
తెలంగాణలో ఆగస్టు 7న నేతన్న బీమా పథకం ప్రారంభించనున్నట్టుగా రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం కొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా చెప్పారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా నేతన్నకు బీమా పథకం తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని చెప్పారు. రైతు బీమా మాదిరిగానే నేతన్న బీమా పథకం అమలు చేయనున్నట్టుగా వివరించారు.
పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో (LIC) తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 60 ఏండ్లలోపు వయస్సున్న చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ బీమా పథకానికి అర్హులని చెప్పారు.
నేతన్న బీమా పథకం ద్వారా తెలంగాణలోని దాదాపు 80,000 మంది నేత కార్మికులకు లబ్ది చేకూరనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు.