
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు వాటిపై వాల్ రైటింగ్స్ రాయకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాల్ రైటింగ్స్ రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని జీహెచ్ఎంసి అధికారులకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా చర్యలకు వెనుకాడొద్దన్నారు. అప్పుడే అందరికీ ఆదర్శంగా నిలుస్తామన్నారు.
నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ కళామేళాలో కెటిఆర్ పాల్గొన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్ను మరింత సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక కళారూపాలకు నిలయమని మంత్రి పేర్కొన్నారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా హైదరాబాద్ స్వరూపాన్ని కళాకారులు మార్చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ కళాకారుడిని వెలుగులోకి తీసుకురావాలన్నారు. కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.