
మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ వేడి మరింతగా పెరిగింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే గతానికి భిన్నంగా ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే.. తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూపంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తరఫున మునుగోడులో ప్రచారం చేస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్న రాజగోపాల్ రెడ్డి తన సొంత సోదరుడు కావడంతో వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటారనే ప్రచారం సాగింది.
అయితే గత నెలలో ఓ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడులో ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కానీ మునుగోడులో కాంగ్రెస్కు మద్దతుగా ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ, పాజిటివ్గా మాట్లాడటం గానీ జరగలేదు. అయితే కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాత్రం.. మునుగోడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా వెంకట్ రెడ్డిని తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కోరారు. మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తాను కూడా వస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని స్రవంతి చెబుతున్నారు. నేడు (అక్టోబర్ 09) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుమానం వద్దని.. పార్టీ విజయం కోసం ఆయన పనిచేస్తారని చెప్పారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాలని వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో అక్కడే ఉండనున్నారని.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాతే ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్కు కొద్దిపాటి షాకింగ్ విషయమనే చెప్పాలి. మరి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనసు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తారనేది వేచిచూడాల్సి ఉంది. కొందరు టీ కాంగ్రెస్ నేతలు మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి రాకపోయిన.. పార్టీకి పెద్దగా నష్టం జరగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉండదు. ఒకవేళ ఉప ఎన్నిక ప్రచారానికి, రాహుల్ గాంధీ పాదయాత్రకు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది.
ఇక, మునుగోడుకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోజనాలకు విరుద్ధంగా వెంకట్రెడ్డి పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. వెంకట్ రెడ్డి తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాడని ఆరోపణలు చేశారు. రాజగోపాల్ రెడ్డి గత మూడేళ్లుగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని స్వయంగా అంగీకరించారని.. వెంకట్ రెడ్డి కూడా తన సోదరుడి బాటలో నడుస్తారా అనే సందేహం తమకు ఉందని వారు చెప్పారు.