మునుగోడుపై కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా , అప్పటిదాకా ఢిల్లీలోనే

By Siva KodatiFirst Published Aug 22, 2022, 7:27 PM IST
Highlights

కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధి , పార్టీలో విభేదాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో టీపీసీసీ నేతలతో హైకమాండ్ భేటీ అయ్యింది. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక , ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఏఐసీసీ సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ పయనమయ్యారు. కోమటిరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్‌ను పార్టీ ఇన్‌చార్జి కార్యదర్శిగా రంగంలోకి దింపింది. దీంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీలోని పలువురు నేతలతో చర్చలు జరిపారు. వారి వద్ద నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.  రేవంత్‌ వ్యవహారశైలి, మాణిక్యం ఠాగూర్‌, సునీల్‌ కానుగోలుపై సంచలన ఆరోపణలు చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి‌తో కూడా నదీమ్ జావేద్ భేటీ అయ్యారు. ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ సమాచారం అంతా నదీమ్ జావేద్ నేరుగా ప్రియాంక గాంధీ నివేదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

ALso REad:మునుగోడుపై వేగం పెంచిన కాంగ్రెస్.. రేపు ఢిల్లీలో కీలక సమావేశం.. తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్..!

ఇకపోతే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ కామెంట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వెంకట్ రెడ్డి.. ఉప ఎన్నికపై చర్చలపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి మాత్రం అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరిచాలని డిమాండ్ తీసుకొచ్చారు. తాజాగా తాను మునుగోడులో ప్రచారానికి సిద్దమని ప్రకటించిన వెంకట్ రెడ్డి.. అయితే  స్టార్ క్యాంపెయినర్‌గా తనకు బాధ్యతలు అప్పగించాలని కోరినట్టుగా వార్తలు వచ్చాయి.

కాగా.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ  క్రమంలోనే ప్రియాంక నేతృత్వంలో సమావేశానికి రావాల్సిందిగా.. టీ కాంగ్రెస్ నేతలకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారా?, హాజరైతే ఆ సమావేశంలో ఏ విషయాలను ప్రస్తావిస్తారానేది తెలియాల్సి ఉంది. 
 

click me!