
త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం ఈ ఉపఎన్నిక కోసం ఎదురుచూస్తుందని కోమటిరెడ్డి అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు నియోజకవర్గాన్ని విడిచిపెట్టానని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోనే చేరితేనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తమ తమ నియోజకవర్గాల్లో వున్న సమస్యలపై కేసీఆర్తో మాట్లాడేంత ధైర్యం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
ALso REad:ఇంటికి కిలో బంగారమిచ్చినా.. కేసీఆరే వచ్చి పోటీ చేసినా గెలుస్తా: కోమటిరెడ్డి
అంతకుముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో ఎవరెన్ని కుట్రలు చేసినా.. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి పోటీ చేసినా విజయం తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు
అధికార టీఆర్ఎస్ ఇంటికి కిలో బంగారం చొప్పున ఇచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగారెడ్డిగూడెంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్కు దమ్ముంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... బీజేపీలో చేరినట్టు తెలిపారు. మునుగోడులో గెలిచేందుకు సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉండకుండా, ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ నియంతగా పరిపాలిస్తున్నారని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు.