కెసిఆర్ కు ‘తాండూరు’ షాక్

Published : Mar 04, 2017, 01:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కెసిఆర్ కు ‘తాండూరు’ షాక్

సారాంశం

తెరవెనుక ఏం జరిగింది తెలుసుకునేందుకు ఇపుడు టిఆర్ఎస్, ఎంఐఎంలు పోస్టుమార్టమ్ చేస్తున్నాయి.

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు పెద్ద షాక్. రాష్ట్రంలో తమకు ఎదురేలేదనుకుంటున్న సమయంలో వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటమంటే మాటలు కాదు. అది కూడా మిత్రపక్షాలైన టిఆర్ఎస్-ఎంఐఎంలకు కౌన్సిల్లో పూర్తి మెజారిటీ ఉండి కూడా ఊహించని షాక్ తగిలింది. ఇంత పెద్ద షాక్ తగలటానికి కాంగ్రెస్, టిడిపి, భాజపాలు చేతులుకలపటమే కారణం. వారికి ఎంఐఎంలోని చీలికవర్గం పూర్తిగా సహకారించటం. దాంతో మున్సిపాలిటి కాంగ్రెస్ పరమైంది.

 

తాండూరు మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లున్నారు. వారిలో టిఆర్ఎస్, ఎంఐఎం తరపున చెరో పదిమంది గెలిచారు. కాంగ్రెస్ కు 8, టిడిపి, భాజపా తరపున చెరో ఇద్దరు గెలిచారు. ఎవరికీ సరైన మెజారిటీ రాని కారణంగా రెండున్నరేళ్ళ క్రితం టిఆర్ఎస్, ఎంఐఎంలు ఒప్పందానికి వచ్చాయి. టిఆర్ఎస్ కౌన్సిలర్ విజయలక్ష్మి ఛైర్ పర్సన్ అయ్యారు.  వైఎస్ ఛైర్ పర్సన్ గా ఎంఐఎం కౌన్సిలర్ నియమితులయ్యారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ళు అయిపోయింది. దాంతో విజయక్ష్మి రాజీనామ చేసారు. ఇక, ఎంఐఎం కౌన్సిలర్ ఛైర్ పర్సన్ అవ్వాటమే మిగిలింది.  

 

జిల్లా సబ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఎన్నిక నిర్వహించారు. కౌన్సిలర్లందరూ సమావేశ మందిరంలోకి వచ్చారు. ఒప్పందం ప్రకారం కౌన్సిలర్ ను ఛైర్ పర్సన్ గా ప్రతిపాదించాల్సిన ఎంఐఎం పోటీ నుండి తప్పకున్నది. దాంతో ఒక్కసారిగా అందరూ విస్తుపోయారు. ఒప్పందానికి విరుద్ధంగా ఎంఐఎం ప్రకటించటంతో ఏం చేయాలో ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. వెంటనే తేరుకున్న మంత్రి మహేందర్ రెడ్డి ఎంఐఎంతో నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వారెవరూ అంగీకరించలేదు.

 

వీరిమధ్య వ్యవహారం ఇలావుండగానే, కాంగ్రెస్, టిడిపిల, భాజపాలు ఏకమయ్యాయి. వెంటనే తమ తరపున సునీతా సంపత్ ను పోటి పెడుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించేసింది. దాంతో అందరూ బిత్తరపోయారు. అసలేం జరుగుతోందో తెలుసుకునేలోపే సునీతకు ఎంఐఎంలోని ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు పలికారు. దాంతో కాంగ్రెస్, టిడిపి, భాజపాలకు చెందిన 12 మంది కౌన్సిలర్లకు తోడు ఎంఐఎంలోని 6గురు కౌన్సిలర్లు కలవటంతో 18 ఓట్లు వచ్చేసాయి. చేసేది లేక రిటర్నింగ్ అధికారి కూడా కాంగ్రెస్ అభ్యర్ధి సునీత గెలిచినట్లు ప్రకటించారు. తెరవెనుక ఏం జరిగింది తెలుసుకునేందుకు ఇపుడు టిఆర్ఎస్, ఎంఐఎంలు పోస్టుమార్టమ్ చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House