హైదరాబాదుకే ఎందుకు: కర్ణాటక అఫైర్స్ లో కేసీఆర్ దే కీలకం

First Published May 20, 2018, 9:30 AM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప 55 గంటల లోపే దిగిపోవడానికి కాంగ్రెసు, జెడిఎస్ క్యాంప్ రాజకీయాలను సమర్థంగా నడపడమే కారణమని అంటున్నారు.

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప 55 గంటల లోపే దిగిపోవడానికి కాంగ్రెసు, జెడిఎస్ క్యాంప్ రాజకీయాలను సమర్థంగా నడపడమే కారణమని అంటున్నారు. తమ ఎమ్మెల్యేలను హైదరాబాదుకు తీసుకుని వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న చర్యలు ఆ పార్టీలకు పెద్ద యెత్తున ఉపకరించాయి. 

ఎమ్మెల్యేలు జారిపోకుండా కేసిఆర్ ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది. కాంగ్రెసు ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణాలో, జెడిఎస్ ఎమ్మెల్యేలను నోవాటెల్ హోటళ్లలో పెట్టారు. ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇతరులు ఎవరూ ఎమ్మెల్యేలతో టచ్ లోకి రాకుండా చూశారు. 

జెడిఎస్ నేతలు దేవెగౌడతో, కుమారస్వామితో ఉన్న సత్సంబంధాల వల్లనే కేసిఆర్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లడానికి కర్ణాటకలో జెడిఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఉపకరిస్తుందని కేసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. 

ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకోవడానికి స్టార్ హోటళ్ల వద్ద, కీలకమైన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం నిఘా అధికారులను మోహరించింది. వారు ఎప్పటికప్పుడు తమకు తెలిసిన విషయాలను ఉన్నతాధికారులకు చేరవేస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెసు, జెడిఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం చిక్కింది. 

మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ను బ్లాక్ చేయడానికి జామర్స్ ను ఏర్పాటు చేశారు. శిబిరంలోని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపకుండా కమ్యూనికేషన్ మోడ్స్ అన్నింటిని స్తంభింపజేశారు. 

click me!