అందుకే బీఆర్ఎస్‌ను వీడాలనుకున్నాం: అనుచరుల సమావేశంలో కడియం

By narsimha lodeFirst Published Mar 31, 2024, 8:30 AM IST
Highlights

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ నేతల నుండి సహకారం లభించలేదని  కడియం శ్రీహరి ఆరోపించారు.

హైదరాబాద్:ఓడిపోయే పార్టీ నుండి పోటీ చేయడం వద్దనుకున్నామని  మాజీ డిప్యూటీ సీఎం  కడియం శ్రీహరి చెప్పారు.శనివారంనాడు హైద్రాబాద్ లోని తన నివాసంలో  కడియం శ్రీహరి  తన అనుచరులతో  సమావేశమయ్యారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని  కడియం శ్రీహరి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి రెండు రోజుల క్రితం  కడియం శ్రీహరి,ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరిన విషయం తెలిసిందే. దరిమిలా  తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని  కడియం శ్రీహరి  ప్రకటించారు.  ఈ నెల  30న తన అనుచరులతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. స్టేషన్ ఘన్ పూర్  అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  తన అనుచరులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ బీఆర్ఎస్ ను వీడిన సమయంలో ఎందుకు  విమర్శించలేదని  కడియం శ్రీహరి ప్రశ్నించారు.  తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎందుకు  ఇంతలా విమర్శిస్తున్నారని  కడియం శ్రీహరి ప్రశ్నించారు.  ఎంత ఎక్కువగా విమర్శ వస్తే అంత ఎక్కువ బలం ఉందని అర్ధమౌతుందన్నారు.

ఆరూరి రమేష్ వద్దంటేనే  బీఆర్ఎస్ పార్టీ తన కూతురు కావ్యకు టిక్కెట్టు ఇచ్చిందన్నారు.  పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా  కూడా పోటీ చేయాలని భావించిన విషయాన్ని కడియం శ్రీహరి చెప్పారు. కానీ, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని  బీఆర్ఎస్ నేతల నుండి సహకారం లభించని విషయాన్ని  కడియం శ్రీహరి ప్రస్తావించారు.

తన కూతురు కావ్య తొలిసారిగా పోటీ చేయాలని భావిస్తున్నారన్నారు.తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో  వ్యాఖ్యానించారు కడియం శ్రీహరి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న కావ్యను ఓడిపోయే పార్టీ నుండి  పోటీ వద్దనుకున్నామని కడియం శ్రీహరి  ప్రకటించారు.

 

 

click me!