‘దిశ’నిందితుల ఎన్ కౌంటర్.. సజ్జనార్ ని ఎందుకు ప్రశ్నించలేదు..?

By telugu news teamFirst Published Sep 25, 2021, 9:22 AM IST
Highlights

ఘటనాస్థలంలో వెలుతురు ఉందని దర్యాప్తు అధికారి రికార్డు చేశారని అదే అధికారి చీకటి ఉందనిపించేలా శబ్దం వచ్చిన వైపు కాల్చాలని పోలీస్ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నట్లు కమిషన్ పేర్కొంది. 

‘దిశ’ఘటన హైదరాబాద్ నగరంలో ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. వెటర్నరీ డాక్టర్ అయిన ఓ యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడి అనంతరం బతికుండగానే తగలపెట్టేశారు. కాగా.. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తర్వాత ఎన్ కౌంటర్  చేశారు. కాగా.. ఈ ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సిర్పర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది.

ఎన్ కౌంటర్ పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్ చీఫ్ మహేష్ భగవత్ ను కమిషన్ శుక్రవారం విచారించింది, నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్ సజ్జనార్ ను, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని విచారించారా? అని భగవత్ ను కమిషన్ ప్రశ్నించింది. ఆయన దానికి లేదు అని బదులిచ్చారు,  సంచలనం సృష్టించిన కేసుల్లో వారిని విచారించాలని అనిపించలేదా అని ప్రశ్నించగా,.. ఆ అవసరం లేదనిపించలేదన్నారు.

ఘటనాస్థలంలో వెలుతురు ఉందని దర్యాప్తు అధికారి రికార్డు చేశారని అదే అధికారి చీకటి ఉందనిపించేలా శబ్దం వచ్చిన వైపు కాల్చాలని పోలీస్ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ రెండు వైరుధ్యంగా ఉన్నాయని.. ఈ రెండు అంశాలపై సిట్ దర్యాప్తులో గుర్తించారా అని ప్రశ్నించగా.. లేదని భగవత్ బదులిచ్చారు.

ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశం 5వ గట్టు అని మీకెలా తెలిసిందని అడిగితే.. సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి అభిప్రాయమని చెప్పారు.

‘దిశ’కు సంబంధించిన వస్తువుల్ని ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచే స్వాధీనం చేసుకున్నట్లు మీకు ఎలా తెలుసు అని అడగ్గా... అది సిట్ పరిధిలో లేని అంశంగా పేర్కొన్నారు. నిందితులను విచారణ నిమిత్తం ఉంచిన రవి గెస్ట్ హౌస్ యజమానికి సంబంధించి రెండు విధాలుగా వాంగ్మూలం ఎలా నమోదు చేశారనగా సరైన జవాబు లభించలేదు. ఎన్ కౌంటర్ కు సంబంధించి సిట్ సొంత స్కెచ్ రూపొందించిందా అని అడిగితే లేదన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయుధ సామాగ్రి సంబంధిత రిజిస్టర్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఉంటుందన్నారు. నివేదిక ఆ అంశం ఎందుకు రాయలేదని అడిగితే సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

సిట్ కేస్ డైరీ రాసిన వనపర్తి ఎస్పీ అపూర్వారావును కమిషన్ విచారించింది. ఎదురుకాల్పుల సమయంలో కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యామని ఆయన రాశారని.. ఆస్పత్రి నివేదికలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు గాయమైందని ఉందని కమిషన్ ప్రశ్నించగా.. పొరపాటున తాను అలా అనుకున్నానని చెప్పడం గమనార్హం.
 

click me!