
హైదరాబాద్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో బండి సంజయ్ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయన ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. మరోవైపు ఆయనను బుధవారం సాయంత్ర మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే బండి సంజయ్ను మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసినప్పటీ నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
బండి సంజయ్ అరెస్ట్ను టీ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్తో తెలంగాణలోని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పలుచోట్ల సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బండి సంజయ్ను బొమ్మలరామారం పోలీసు స్టేషన్ నుంచి వరంగల్కు తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీజేపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
Also Read: ఎస్ఎస్సీ పేపర్ లీక్: బండి సంజయ్ పాత్రను గుర్తించారిలా....
అయితే ఈ పరిణామాలపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం దృష్టిసారించింది. బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిణామాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివరాలు సేకరించారు. బుధవారం నడ్డా బీజేపీ లీగల్ టీమ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావుకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం తెలంగాణలో పరిస్థితులు, బండి సంజయ్ అరెస్ట్ తదితర వివరాలను జేపీ నడ్డా, అమిత్ షాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదించినట్టుగా తెలుస్తోంది.
అయితే బండి సంజయ్కు అండగా ఉంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. బండి సంజయ్ అరెస్ట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. బుధవారం బీజేపీ రాష్ట్ర నేతలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని, బీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు.
మరోవైపు బండి సంజయ్ అరెస్ట్పై బీజేపీ ఎంపీలు బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. లోక్సభ సభ్యునిగా ఉన్న బండి సంజయ్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని రూల్ 223 ప్రకారం బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రివిలేజ్ నోటీసులు అందించారు. ఇక, బండి సంజయ్ అరెస్ట్పై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు.