
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ సమావేశం నుండి సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం నాడు బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును Jagga Reddy తప్పుబట్టారు.
ఆదివారం నాడు CLP సమావేశం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే జగ్గారెడ్డి ఈ సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో విసుగు చెందినట్టుగా చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు పార్టీలో చేదు అనుభవం ఎదురైందన్నారు. తనను అవమానించేవారు ఎవరూ కూడా Congress పార్టీలో లేరన్నారు. మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పీసీసీ చీఫ్ Revanth Reddyతనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ పద్దతి తనకు నచ్చడం లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎల్పీ సమావేశం డిస్టర్బ్ కావొద్దని తాను సైలెంట్ గా వెళ్లిపోతున్నానని జగ్గారెడ్డి వివరించారు.
ఇవాళ కూడా మెదక్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు.ఈ పర్యటన సమాచారం తనకు ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించవద్దని భట్టి విక్రమార్కతో పాటు పార్టీ నేత కుసుమ కుమార్ సూచించడంతో జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో కూడా మెదక్ జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా జిల్లాకు చెందిన తమకు సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈ విషయమై లేఖ రాశారు. రేవంత్ రెడ్డి తీరును జగ్గారెడ్డి తప్పు బట్టారు. అయితే ఈ విషయమై పార్టీలో సీనియర్ నేతలు రాజీనామా విషయమై పునరాలోచన చేయాలని కోరారు. దీంతో రాజీనామాపై 15 రోజుల పాటు ఆలోచన చేస్తానని ఆయన ప్రకటించారు. జగ్గారెడ్డితో గత మాసంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు నేలు సమావేశమయ్యారు. రాజీనామా చేయవద్దని కోరారు. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి రాజీనామా వ్యవహరాన్ని రేవంత్ రెడ్డి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా పేర్కొన్నారు. ఈ విషయమై జగ్గారెడ్డి సీరియస్ గా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పు బట్టారు.
ఇదిలా ఉంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కావాలని జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారితో సమావేశం కోసం సమయం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. జగ్గారెడ్డి తో పాటు మరికొందరు నేతలు కూడా రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.పార్టీలో అందరిని రేవంత్ రెడ్డి కలుపుకుపోవడం లేదని వి. హనుమంతరావు విమర్శించారు. ఇదే విషయమై తాను కూడా పార్టీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని వి. హనుమంతరావు చెప్పారు.