
తెలంగాణవ్యాప్తంగా ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చెందిన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన రూ.412 కోట్ల లావాదేవీలపై తనిఖీలు చేపట్టింది ఐటీ శాఖ. సొసైటీ పేరు చెప్పి విదేశాల నుంచి నిధులు రాబట్టారు శౌరెడ్డి. విదేశీ నిధులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. శౌరెడ్డి, భార్య సునీతా రెడ్డి పేర్లపై భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా నిర్ధారించింది. అలాగే సొసైటీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లపైనా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది. వరంగల్, హైదరాబాద్తో కలిపి మొత్తం 40 చోట్ల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నాయి. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.