శ్రీ చైతన్య కాలే‌జ్‌‌లో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఇంటర్ బోర్డు విచారణ.. యాజమాన్యానికి నోటీసులు..!

Published : Mar 02, 2023, 12:48 PM IST
శ్రీ చైతన్య కాలే‌జ్‌‌లో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఇంటర్ బోర్డు విచారణ.. యాజమాన్యానికి నోటీసులు..!

సారాంశం

హైదరాబాద్‌ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల‌లో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర  కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విచారణ చేపట్టింది.

హైదరాబాద్‌ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల‌లో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర  కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విచారణ చేపట్టింది. డీఈవో ఆధ్వర్యంలో అధికారులు నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌ను  సందర్శించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా అధికారులు సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చైతన్య యాజమాన్యానికి ఇంటర్ బోర్డు నోటీసులు జారీచేసింది. దీనిపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు రిపోర్టును సిద్దం చేసి ఇంటర్ బోర్డు కమిషనర్‌కు అందజేయనున్నారు. 

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడు సాత్విక్.. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.  మంగళవారం కాలేజ్ హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి.. కాలేజ్ లెక్చరర్లు వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని లెక్చరర్లు వేధించినట్టుగా  సాత్విక్ తమతో చెప్పుకుని బాధపడినట్టుగా అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సాత్విక్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్ నరకం చూపిస్తున్నారని అందులో రాసి ఉంది. వారి టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సాత్విక్ తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు. అమ్మ, నాన్న, అన్నయ్య ఈ పని చేస్తున్నందుకు క్షమించండని పేర్కొన్నాడు. ఇక, ఈ ఘటనపై సాత్విక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి కొందరిని  అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించింది. 

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ మృతి దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు. దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu