
తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని అల్వాల్, బొల్లారం, జీడిమెట్ల, పటాన్చెరు, సికింద్రాబాద్, మెదక్ జిల్లాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 9 సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న జాబితాలో బాలవికాస్ ఫౌండేషన్ కూడా ఉంది.
బాల వికాస్ ఫౌండేషన్.. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో ఎన్జీవోగా రిజిస్టర్ అయింది. ఈ సంస్థను 2016లో ఏర్పాటు చేశారు. బాల వికాస్ ఫౌండేషన్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.. బాల వికాస్ ఫౌండేషన్ డైరెక్టర్ల నివాసాలలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ సోదాలను ముమ్మరం చేయడం చర్చనీయాంశంగా మారింది.